కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ కార్పొరేషన్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ మేయర్ పీఠం (Nizamabad Mayor) దక్కించుకోవాలని ఆశపడుతున్న అధికార పార్టీ అభ్యర్థులందరూ ఒకే వార్డు నుంచి బరిలోకి దిగుతుండడం దీనికి కారణం. వీళ్లంతా పోటీ పడుతున్న ఆ స్థానం.. వార్డు నెం.19. ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్న వాళ్లంతా హేమాహేమీలే కావడం మరో విశేషం.
బరిలో వీళ్లే..?
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ మహిళలకు దక్కింది. ఈ క్రమంలో ఇక్కడ మేయర్ అభ్యర్థిత్వానికి అధికార పార్టీలో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో మొదట వినిపించిన పేరు డాక్టర్ కవితారెడ్డి. అయితే, ఆమెకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తామని హామీ దక్కినట్లు తెలుస్తోంది. దీంతో మేయర్ రేసు నుంచి ఆమె తప్పుకుంటారని వినిపిస్తోంది.
ఇక, మేయర్ సీటే లక్ష్యంగా వార్డు నెం.19 నుంచి బరిలోకి దిగనున్నవాళ్లలో వినిపించిన మరో పేరు మానాల సవితా రెడ్డి. ఈమె ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సవితారెడ్డి.. మాజీ డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డికి కోడలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్కు, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, సీనియర్ నేత భూపతిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఇప్పుడు ఆయన కోడలు వార్డు నెం.19 నుంచి పోటీకి నిలవనుండడం ఆసక్తి కలిగిస్తోంది.
ఇక, ఇదే డివిజన్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మరో అభ్యర్థి కేశ మహేశ్. ఈయన నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ కేశ వేణు సోదరుడు. కేశ వేణు సైతం సుదర్శన్ రెడ్డికి, మహేశ్ గౌడ్కు, షబ్బీర్ అలీకి, సీనియర్ నేత భూపతిరెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. రిజర్వేషన్ ప్రకారం ఈయనకు మేయర్ (Nizamabad Mayor) పీఠంపై కూర్చునే అవకాశం లేదు. అయినా, ఈ వార్డు ఎంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.
అలాగే ఇదే వార్డు నుంచి కాంగ్రెస్ నాయకుడు పురణ్ రెడ్డి సోదరి, ప్రముఖ వ్యాపారి నల్ల దినేష్ రెడ్డి సతీమణి స్రవంతి రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. మరో ప్రముఖ వ్యాపారి నరేందర్ రెడ్డి సతీమణి సైతం ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే డివిజన్ నుంచి పోటీకి మాజీ కార్పొరేటర్ కెప్టెన్ శ్రీను ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి బరిలోకి దిగాలనుకున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వార్డు నెం.19 చర్చల్లో నిలుస్తోంది.
Read Also: కాంగ్రెస్ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు : కేటీఆర్
Follow Us On: Instagram


