కలం వెబ్ డెస్క్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44 వార్డుల రిజర్వేషన్ (Municipal Reservations) అంశంపై తెలంగాణ హైకోర్ట్ (High Court) కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్డులను ఎస్సీ కేటగిరీకి కేటాయించడాన్ని సవాలు చేస్తూ పి.లక్ష్మీనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్ట్ మంగళవారం విచారించింది.
డబ్ల్యు.పీ. నెం. 1729 ఆఫ్ 2026 కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, ఈ వ్యవహారంపై నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని ఆదేశించారు. పిటిషనర్ ఇటీవల జనవరి 17న సమర్పించిన ప్రతినిధి అభ్యర్థనను పరిశీలించి, మూడు రోజులలోగా తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. వార్డులు 39, 40, 44లను ఎస్సీ కేటగిరీకి కేటాయించేటప్పుడు అక్కడి ఎస్సీ ఓటర్ల జనాభాను సరిగా పరిశీలించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13న జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం.14 మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ రిజర్వేషన్ జరిగిందని వాదించారు.
ఈ కేటాయింపులు చట్ట విరుద్ధంగా, యథేచ్ఛగా జరిగాయని పేర్కొంటూ, ఆయా వార్డులను ఎస్సీ కేటగిరీ కాకుండా ఇతర కేటగిరీలకు కేటాయించే అంశాన్ని పునర్విచారణ చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పు వచ్చే వరకు జిల్లా కలెక్టర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును తదుపరి విచారణకు ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్ (Municipal Reservations) కేటాయింపులు జనాభా ఆధారంగా, నిబంధనల ప్రకారం జరగాల్సిన అవసరం మరోసారి స్పష్టమైందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also: మేడారంలో కుక్కకు తులాభారం వేసిన నటి.. భక్తుల ఆగ్రహం
Follow Us On: Sharechat


