కలం, వెబ్ డెస్క్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి “తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు.. రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్, స్విట్జర్లాండ్ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ –2026 సదస్సు (Davos WEF)లో పాల్గొన్నది. మంగళవారం సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన “ఇండియా పెవిలియన్” ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. అందుకు అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామన్నారు.
ఈ విజన్ డాక్యుమెంట్ లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఫార్మస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, హార్డ్ వేర్ మానుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరో స్పేస్, డిఫెన్స్, టెక్స్ట్ టైల్, అపరెల్ మానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఇక్కడి ఎకో సిస్టం గురించి వివరించారు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వెల్లడించారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందని తెలిపారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. “తెలంగాణ బ్రాండ్” మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.O, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్) ను దావోస్ (Davos WEF) వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.
Read Also: ముగిసిన హరీశ్రావు సిట్ విచారణ
Follow Us On: X(Twitter)


