కలం, నల్లగొండ బ్యూరో: ప్రజా జీవితంలో తపస్సులా ముందుకెళ్తున్నానని, పేదల జీవితాలు బాగుపడేలా చేయడమే తన ధ్యేయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట (Suryapet) జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ (Nereducharla Municipality) పరిధిలోని 404 స్వయం సహాయక మహిళా సంఘాలకు 52,07,399 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాక ఇందిరా మహిళా శక్తి పథకం కింద 5498 మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వడ్డీ లేని రుణాల పంపిణీతో పాటు 5498 మందికి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. మిర్యాలగూడ నుండి నేరేడుచర్ల, కోదాడ మీదుగా ఖమ్మం జాతీయ రహదారి వరకు రహదారిని వేయించింది గతంలో తానేనని గుర్తు చేశారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు హుజూర్నగర్లో 7.50 కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాలను, 4.50 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల భవనాలు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 కోట్లతో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హుజూర్నగర్లో మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తే.. 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని 4500 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక అజెండా : ఎర్రబెల్లి దయాకర్ రావు
Follow Us On: Pinterest


