కలం, వెబ్డెస్క్: జిల్లాల మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన (District Reorganisation) పై కమిషన్ వేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గతంలో నాయకులకు నచ్చినట్లుగా జిల్లాల విభజన జరిగిందన్నారు. దాన్ని సరిదిద్దే బాధ్యత తమపై ఉందని చెప్పారు. సోమవారం ప్రజాభవన్ వేదికగా విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గతంలో అర్థం పర్థం లేకుండా, అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. ఆ లోపాన్ని, పొరపాటును సరిదిద్దాల్సి ఉన్నది. దీనికోసం ప్రత్యేక కమిటీ వేసి మార్పులు, చేర్పులు చేస్తాం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తాం. మాజీ అధికారులూ ఇందులో ఉంటారు. జిల్లాల సంఖ్య పెంచడమా, తగ్గించడమా అన్నది కాదు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయి. నాయకులకు నచ్చినట్లుగా అప్పట్లో విభజన జరిగింది. ఐదు మండలాలతో ఒక జిల్లా పరిషత్ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సరిహద్దులు ఫిక్స్ అవుతాయి. విధాన నిర్ణయానికి ముందు అసెంబ్లీ వేదికగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. అలాగే సికింద్రాబాద్ అంశంపైనా సీఎం స్పందించారు. ‘సికింద్రాబాద్ పేరును నేనేం ముట్టుకోలేదు కదా? ఆ పేరును నేను ఎక్కడ తీసేశాను?’ అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ పేరు, మేడ్చల్–మల్కాజ్గిరి పేరు తాను పెట్టలేదన్నారు. రాజును తలపించేలా రాచకొండ పేరు ఉందన్నారు.
Read Also: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నేనే పరిష్కరిస్తా : సీఎం రేవంత్
Follow Us On: Youtube


