కలం, నిజామాబాద్ బ్యూరో: ‘ఆపరేషన్ సింధూర్ తెలుసు.. ఈ ఆపరేషన్ ఇందూర్ కథేంటి’ అనే కదా మీ ఆలోచన.. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నిజామాబాద్లో (Nizamabad) బీజేపీ రెండు స్థానిక నినాదాలను తెరమీదకు తెస్తోంది. అందులో ఒకటి నిజామాబాద్ పేరును ఇందూర్గా మారుస్తామని, రెండోది నిజామాబాద్ కార్పొరేషన్కు స్థానిక వ్యక్తే మేయర్ గా ఉండాలని.. ఈ రెండు అంశాలపై ఆందోళనలు చేసేందుకు కూడా బీజేపీ సిద్ధపడుతోంది.
గతంలో చేసిన ప్రకటన మేరకు..
‘నిజామాబాద్ (Nizamabad) పేరును మార్చి తీరుతాం’ అని ఎంపీ అర్వింద్ గతంలో ప్రకటించారు. ఇండియాకు హిందుస్థాన్ పేరు గతంలో ఉండేదని.. భవిష్యత్లో కూడా ఆ పేరు పెట్టే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. గత బల్దియా సమయంలోనే ప్రయత్నం జరిగినా త్రుటిలో తప్పిపోయిందని.. ఈ సారి బల్దియాపై బీజేపీ జండాను ఎగురవేయడం ఖాయమని తొలి బల్దియా సమావేశంలోనే నిజామాబాద్ పేరును ‘ఇందూర్’గా మార్చేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని అర్వింద్ అంటున్నారు.
ఆ పేరే దరిద్రం
నిజామాబాద్ పేరు అంటేనే దరిద్రం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పేరు వల్లే జిల్లా అభివ్రుద్ధి కుంటుపడిందని వాదిస్తున్నారు. నిజాం అనే పేరుతోనే నిజాం సాగర్ కు నీళ్లు లేక వెల వెల పోతుందని నిజాం షుగర్ మూతపడిందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందడం లేదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ కూడా ఇదే డిమాండ్ తెరమీదకు తెచ్చారు. ఇందూరు నగరంలోని 36వ డివిజన్లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమంద్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాదు పేరు తీసివేసి ఇందూరు పేరు మార్పు కార్యక్రమం చేపట్టారు. 36వ డివిజన్ పరిధిలోని షాపులపై ఉన్న నిజామాబాద్ పేరును తొలగించి ఇందూర్ అనే పేరున్న పోస్టర్ను అతికించారు. చారిత్రకమైన ‘ఇందూరు’ అనే పేరునే ఉపయోగించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
ఇందురు అంటే ఓ చరిత్ర
ఈ సందర్బంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఇందూరు అనేది కేవలం ఒక పేరు కాదు. ఇది ఈ ప్రాంత ప్రజల చరిత్ర, సంస్కృతికి ప్రతీక. ఇందూరు అనే పేరు ప్రజల గుండెల్లో ఉన్న గర్వం. ఆ పేరును వ్యతిరేకించడం అంటే, ఈ నేలపై జీవిస్తున్న ప్రజలను అవమానించినట్లే. ప్రజల భావాలను దెబ్బతీసే రాజకీయ వ్యాఖ్యలను గట్టిగా ఎదుర్కొంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, దత్రిక పరమేష్, బూరుగుల వినోద్లతో పాటు, 36వ డివిజన్ ఇంచార్జ్ మురళి కృష్ణ పాల్గొన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ మరో స్థానిక నినాదం తెర మీదకు తెచ్చారు. నిజామాబాద్ లో కామారెడ్డి జిల్లాకు చెందిన యువ నాయకుడిని మేయర్గా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. స్థానిక వ్యక్తులనే కార్పొరేటర్లుగా మేయర్గా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
Read Also: మేడారం భక్తులకు ఆరోగ్య భరోసా: మంత్రి రాజనర్సింహ కీలక ఆదేశాలు
Follow Us On: Instagram


