కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు రూ.200 కోట్ల 45 ఏర్పాటు చేయబోయే ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే ఐదేళ్లలో 500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది.
అలాగే, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఓకే చెప్పింది. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదించింది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్లు పంపిణీకి రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోందించిన Andhra Pradesh మంత్రివర్గం.. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతించింది.


