కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు ఐపీఎల్ జట్టు కేకేఆర్కు (కోల్కతా నైట్రైడర్స్) ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ (Mustafizur Rahman) వెంటనే తప్పించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అతడి స్థానంలో మరో క్రికెటర్ను నియమించుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఇక్కడి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ఉండటం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మేరకు శనివారం బీసీసీఐ కార్యదర్శి దేవిత్ సైకియా ఓ ప్రకటన విడుదల చేశారు.
వివాదం ఏమిటి?
ఇటీవల బంగ్లాదేశ్లో హిందువుల మీద వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో కేకేఆర్ జట్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ ఉండటం పట్ల విమర్శలు వచ్చాయి. కేకేఆర్ జట్టులోకి బంగ్లాదేశ్ క్రికెటర్ను (Mustafizur Rahman) కొనసాగించడం పట్ల ఆ సంస్థ సహ యజమాని షారూఖ్ ఖాన్ మీద విమర్శలు వచ్చాయి. ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్లో హిందువులను క్రూరంగా హత్య చేస్తున్నారు. వారి ఇండ్లను తగలబెడుతున్నారు. హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జట్టు యజమానిగా ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించొద్దా? ఆ దేశానికి చెందిన క్రికెటర్ను తన జట్టులో ఎలా కొనసాగిస్తాడు?” అంటూ ప్రశ్నించారు.
షారూఖ్.. సారీ చెప్పాలని డిమాండ్
ఇదే అంశంపై ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ కూడా స్పందించారు. కేకేఆర్ జట్టులో బంగ్లాదేశ్ పేసర్ను కొనసాగిస్తున్నందుకు షారుఖ్ ఖాన్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ షారుఖ్ ఖాన్ ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్తాఫిజుర్ను జట్టులో నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. “బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి షారుఖ్ ఖాన్కు సమాచారం లేదా? అక్కడ జరుగుతున్న అఘాయిత్యాల గురించి తెలిసినా ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాడిని కేకేఆర్ ఎందుకు తీసుకుంది? షారుఖ్ ఖాన్ దేశానికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ దాడులను ఖండిస్తూ ప్రకటన ఇవ్వాలి” అని ఇల్యాసీ పేర్కొన్నారు. శివసేన నేత సంజయ్ నిరుపమ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. బంగ్లాదేశ్ ఆటగాడిని తొలగించకపోతే షారుఖ్ ఖాన్ లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథ్ స్పందిస్తూ.. అసలు ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను చేర్చడానికి ఎవరు అనుమతిచ్చారన్నదే అసలు ప్రశ్న అన్నారు. ఐసీసీ చైర్మన్ జైషా ఏం చేస్తున్నట్టు? అని ఆమె ప్రశ్నించారు. తీవ్ర ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


