కలం, వెబ్డెస్క్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో జరిగిన జల్లికట్టు (Jallikattu) వేడుకల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా, వేడుక కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 200కు పైగా ఎద్దులు బరిలోకి దిగాయి. వీటిని లొంగదీసుకునేందుకు యువకులు ఉత్సాహంగా, ధైర్యంతో పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎడ్ల వేగానికి చాలా మంది కిందపడి గాయాలపాలయ్యారు. వీరిలో తీవ్రంగా దెబ్బలు తగిలిన ఐదుగురిని హాస్పిటల్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
జల్లికట్టు (Jallikattu) తమిళనాడు సంప్రదాయ క్రీడ. ఏటా సంక్రాంతి మూడో రోజు ఆ రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లా అయిన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ జల్లికట్టును వైభవంగా నిర్వహిస్తారు. అయితే, పండుగకు కొన్ని రోజుల ముందు కూడా చాలా గ్రామాల్లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో పోటీ కోసం సిద్ధం చేసిన ఎద్దు కొమ్ములకు బంగారు లేదా వెండి నాణేలను తాడుతో కడతారు. అనంతరం జన సమూహం మధ్యలో ఆ ఎద్దును వదులుతారు. ఎవరైతే ఆ ఎద్దు మూపురం గట్టిగా పట్టుకొని, అదుపు చేస్తారో వాళ్లకు ఆ నాణేలు ఇస్తారు. పులికులం లేదా కంగాయం అనే ఒక రకం ఎద్దులను మాత్రమే ఈ పోటీలకు అనుమతిస్తారు. ఏ ఎద్దు అయితే, ఎవరికీ లొంగకుండా పోటీలో నెగ్గుతుందో దానికి మార్కెట్లో ఎక్కువ రేట్ పలుకుతుంది. జల్లికట్టునే తమిళనాడులో సల్లికట్టు అని కూడా అంటారు.
Read Also: వాహనదారులకు షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On: Youtube


