కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games) లో భారత షూటర్లు రజత పతకంతో బోణీ కొట్టారు. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. సీనియర్ షూటర్ ఎలావెనిల్ వలరివన్, తొలిసారి ఆడుతున్న సోనమ్ మస్కర్, విదార్సా వినోద్లతో కూడిన భారత బృందం మొత్తం 1898 పాయింట్లు సాధించింది. ప్రపంచ రికార్డు స్కోరు 1904.2 పాయింట్లతో చైనా స్వర్ణం గెలుచుకోగా, జపాన్ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లోనూ భారత షూటర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. చైనా క్రీడాకారిణి వాంగ్ జిఫీ 636.8 పాయింట్లతో ఆసియా రికార్డు నెలకొల్పి అగ్రస్థానంలో నిలిచింది.
కాగా, భారత యువ షూటర్ సోనమ్ మస్కర్ 634.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకుంది. సీనియర్ ప్లేయర్ ఎలావెనిల్ వలరివన్ 633.5 పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకుని ఎనిమిది మంది పాల్గొనే వ్యక్తిగత ఫైనల్కు అర్హత సాధించింది. అయితే మరో భారత షూటర్ విదార్సా వినోద్ 630.4 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. గతేడాది హ్యాంగ్జౌ ఆసియా గేమ్స్లో భారత్ ఏకంగా 22 షూటింగ్ పతకాలు సాధించిన నేపథ్యంలో, ఈసారి కూడా మన షూటర్లు అదే స్థాయి ప్రదర్శనతో మెగా టోర్నీ (Asian Games)ని ప్రారంభించారు.

