కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన కర్ర వినాయకుడిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే, బీజేపీ నాయకులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

