కలం, నిర్మల్: లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ అయిండ్ల భీంరెడ్డి (Aindla Bheem Reddy) 33వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీంరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవను, రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అయిండ్ల భీంరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానంటూ భరోసా కల్పించిన ప్రజానాయకుడిగా ఆయన గుర్తుండిపోయారని పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భీంరెడ్డి కుమారుడు భూపాల్ రెడ్డి, కుమార్తె డాక్టర్ స్వర్ణ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

