కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో (Section 22A Land) చేరిన భూముల సమస్యలకు శాశ్వత ముగింపు పలికేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో వేగవంతంగా పరిష్కరించాలని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు ఒక ఉన్నత స్థాయి హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఉన్నత స్థాయి హైలెవల్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సాంకేతిక పొరపాట్లు, గత రికార్డుల లోపాల వల్ల నిషేధిత జాబితాలోకి వెళ్లిన ప్రైవేట్ భూముల దరఖాస్తులను ఈ కమిటీ క్షుణ్ణంగా సమీక్షించనుంది. ప్రభుత్వ, దేవాదాయ భూములను రక్షిస్తూనే, అర్హులైన ప్రైవేట్ భూయజమానుల హక్కులను కాపాడడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

