కలం, యాదగిరిగుట్ట : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసు (Minor Rape Case)లో నిందితుడికి భువనగిరి (Bhuvanagiri) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తుర్కపల్లి మండలం పెద్ద తండాకు చెందిన ధీరవత్ నవీన్ (25), తండ్రి భీక్యను నిందితుడిగా కోర్టు నిర్ధారించినట్లు తుర్కపల్లి ఎస్ఐ తెలిపారు.
2021 అక్టోబర్ 31న రెండేళ్ల వయస్సున్న మైనర్ బాలిక పొరుగింటికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి ఏడుపు వినిపించడంతో తల్లి అక్కడికి వెళ్లి చూడగా.. నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి 2021 నవంబర్ 1న తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సంబంధిత సాక్ష్యాధారాలను సేకరించి భువనగిరి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్స్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడు ధీరవత్ నవీన్ దోషిగా నిర్ధారిస్తూ గురువారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

