కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పండుగల పరమార్థాన్ని అర్థం చేసుకొని ప్రకృతిని, భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్య (Sada Shivaiah) అన్నారు. సోమవారం రాత్రి మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని ఏనుగొండ అక్షరవీధిలో ఏర్పాటుచేసిన ప్రకృతి గణపతిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.
భారతీయ జీవన విధానమే ప్రకృతితో ముడిపడి ఉందని ప్రజలు బాధ్యతతో ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్ల ముందు పెరట్లో అవసరమైతే మిద్దె తోటలు ఏర్పాటు చేసుకుని మొక్కలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతరించిపోతున్న అరుదైన మొక్కలను తాము జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి సంరక్షించాలని భావితరాలకు ఆరోగ్యకరమైన భారతావనిని అందించాలన్నారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు వార్ల మల్లేశం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు అరుదైన సీతా అశోక్ మొక్కలను పంపిణీ చేశారు. సేంద్రీయ వ్యవసాయ రైతులు దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలను ఈ సందర్భంగా అక్షరవీధి మిత్ర బృందం ఘనంగా సన్మానించారు.

