కలం, నిర్మల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate) ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

