కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) పట్టణంలోని కనకదుర్గ గీతా పారిశ్రామిక సహకార సంఘంలో అర్హులైన గౌడ కులస్తులకు సభ్యత్వాలు కల్పించాలని కోరుతూ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు.
నిరుపేదలు, నిరుద్యోగులు, వితంతు మహిళలకు సభ్యత్వాలు కల్పించకుండా ఆర్థికంగా స్థిరంగా ఉన్న ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు సభ్యత్వాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. సభ్యత్వాల ఎంపికలో అర్హతలు, నిబంధనలు, పారదర్శకత పాటిస్తున్నారా అనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలపై చర్యలు తీసుకుని, అర్హులైన పేద గౌడ కులస్తులకు వెంటనే సభ్యత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

