కలం, వెబ్ డెస్క్: త్వరలోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను ఉండనని, బాల్ థాకరే మాదిరి మెంటార్ పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. అంతేగాకుండా కుటుంబ సభ్యులెవరూ తన పార్టీలో ఉండబోరన్నారు. ఇప్పటివరకు అధికారాన్ని రెండు కుటుంబాలే అనుభవిస్తున్నాయని తెలిపారు. టీడీపీ రెడ్ బుక్ పార్టీ అయితే, వైసీపీ రప్పా.. రప్పా.. పార్టీ అని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడుపుతూ, ఎవరు అధికారంలోకి వస్తే వారు ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ఆ రెండు కులాలకే అధికారం..
అధికారమంటే కేవలం రెడ్లు, కమ్మ కులాలకు పరిమితం కాదని విజయసాయి రెడ్డి అన్నారు. బీసీల్లో ఎంతో మంది సామర్థ్యం ఉన్నారని, వారికి అవకాశం దక్కాలనేదే తన లక్ష్యమన్నారు. గత రెండేళ్లుగా తాను రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన సమయాన్ని ఒక పుస్తకం కోసం వెచ్చించానని, దానిలో ఒక కులం అధికారాన్ని పొందుపరిచినట్లు వివరించారు. ప్రజలను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావడమే తమ ప్రధాన ఆశయమన్నారు.

