కలం, వెబ్ డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు శాతం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఓటు శాతం తగ్గిందంటే ఎమ్మెల్యేలు పని చేయనట్లేనని భావిస్తానని, అలాంటి వారు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్పై ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్’లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమినే విజయం సాధించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రత్యర్థుల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వన్ టైం ఎమ్మెల్యేగా కాకుండా శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేలా పని చేయాలని సూచించారు.
2027 నాటికి పోలవరం పూర్తి..
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. 2027 మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందన్నారు. రాజధాని అమరావతిని కూడా అనుకున్న గడువులోగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు(Bhogapuram Airport)ను ప్రారంభించి, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగామన్నారు. విమానాశ్రయం రాకతో భవిష్యత్తులో విశాఖ ప్రాంతంలో శరవేగంగా పెట్టుబడులు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ షురూ!
Follow Us On : WhatsApp

