కలం, వరంగల్ బ్యూరో: వాతావరణ మార్పుల కారణంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని, దక్షిణాసియా దేశాలు సరిహద్దులు దాటి సమష్టిగా పనిచేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) పిలుపునిచ్చారు. ఆదివారం భూటాన్ రాజధాని థింపూలో జరిగిన సౌత్ ఏషియా పార్లమెంటరీ డైలాగ్లో ఎంపీ కావ్య మాట్లాడారు. అధిక ఉష్ణోగ్రతలు, అనియంత్రిత వర్షాలు, వరదలు, కరువులు, నీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, నీటి సంరక్షణ, హరిత మౌలిక వసతులు, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు.. ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి సాధించడమే నిజమైన సుస్థిర అభివృద్ధి అని కడియం కావ్య పేర్కొన్నారు.

