కలం, వలిగొండ: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా జాతీయ ఉపాధి హామీ పథకం, జలసిరి పథకం ద్వారా ఉచితంగా పంట కుంటల (Farm Ponds) నిర్మాణాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. వలిగొండ మండలంలో పహిల్వాన్ పురంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి ప్రోత్సాహంతో ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది కృషితో నిర్మిస్తున్న పంట కుంట ఎందరినో ఆకర్షిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో సైతం పంటలకు నీరు అందించి కాపాడటంలో ఈ పంట కుంటలు రైతులకు ఎంతో మేలు చేయనుండడంతో పంట కుంటలు రైతులకు అమృత భాండాలు అని చెప్పవచ్చు. పంట కుంటలు పొలాల్లో నిర్మించుకోవడం వల్ల వర్షపు నీరు ఒకచోట నిలిచి, బోరుబావుల్లో, బావుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి. వర్షాలు లేని కరవు సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ కుంటల్లో నిల్వ ఉన్న నీటిని ఉపయోగించి పంటలను ఎండిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. పంట కుంటలతో నీటిని ఒడిసిపట్టి పసిడి పంటలు పండించే అవకాశం ఉండడంతో నీటి నిల్వకు నిలువెత్తు సాక్ష్యం పొలాలలోని పంట కుంటలే వ్యవసాయానికి రక్షణ కవచం అని చెప్పవచ్చు.

