కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి (Yadadri Temple) దర్శనార్థం వచ్చిన హనుమకొండకు చెందిన భక్తురాలు ఉప్పల రాజ్యలక్ష్మి పోగొట్టుకున్న సుమారు 15 గ్రాముల బంగారు పుస్తెలతాడును ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తతతో గుర్తించి తిరిగి ఆమెకు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్న రాజ్యలక్ష్మి కొండ కిందకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులో తన బంగారు పుస్తెలతాడును పోగొట్టుకున్నారు.
వెంటనే ఈ విషయాన్ని హోంగార్డు సిబ్బంది భాస్కర్, విజయ్లకు తెలియజేశారు. వారు డ్యూటీ ఆఫీసర్ ఏఎస్ఐ కనకయ్యకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులందరినీ కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తొలుత పుస్తెలతాడు కనిపించకపోవడంతో బస్సును మరోసారి పూర్తిగా పరిశీలించారు. ఈ క్రమంలో సీటు కింద బంగారు పుస్తెలతాడు లభించింది.
అనంతరం సీఏస్ఓ కే. శేషగిరిరావు సమక్షంలో సుమారు 15 గ్రాముల బంగారు పుస్తెలతాడును భక్తురాలు ఉప్పల రాజ్యలక్ష్మికి సక్రమంగా అప్పగించారు. పోగొట్టుకున్న నగ తిరిగి లభించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తురాలు పోగొట్టుకున్న విలువైన నగను గుర్తించి తిరిగి అప్పగించడంలో సిబ్బంది చూపిన అప్రమత్తతను అక్కడి భక్తులు అభినందించారు.

