కలం, నిర్మల్ : హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ నెల 6న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ టోర్నమెంట్ కు నిర్మల్ జిల్లా (Nirmal) కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్ శనివారం తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు చవాన్ రంజిత్ సింగ్, జాదవ్ కరణ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుష హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

