కలం, వెబ్డెస్క్: టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై ఇవాళ కీలక చర్చ జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్కు జట్టు ఎలా సిద్ధం కావాలనే దానిపైనా బీసీసీఐ (BCCI) దృష్టి పెట్టింది. ఇందు కోసం ముంబైలో బీసీసీఐ పెద్దలు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, అధ్యక్షుడు మిథున్ మన్హాస్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్ హాజరుకానున్నారు. కెప్టెన్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
అందరి దృష్టి మాత్రం రోహిత్పైనే ఉంది. అతడి అనుభవం, సేవలకు బీసీసీఐలో గౌరవం ఉన్నప్పటికీ, 2027 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రణాళికపై ఆలోచన మొదలైంది. రోహిత్ పాత్రను మొత్తం ప్రపంచకప్ సైకిల్కు కాకుండా సిరీస్ వారీగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వన్డే జట్టే మూడు ఫార్మాట్లలో అత్యంత అస్థిరంగా కనిపిస్తోంది. గాయాలు, ఆటగాళ్ల వర్క్లోడ్ కారణంగా పూర్తి స్థాయి కోర్ టీమ్ ఇంకా సిద్ధం కాలేదు.
హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఫిట్నెస్ ఆందోళనగా ఉంది. ప్రస్తుతం అతడికి రోజుకు ఆరు ఓవర్లు బౌలింగ్ చేసేంత క్లియరెన్స్ మాత్రమే ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు. ఇటీవలి పర్యటనల ఫలితాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. ఐర్లాండ్లో టీ20 సిరీస్ను భారత్ 2-0తో కోల్పోయింది. ఇంగ్లండ్లో 4-0తో పరాజయం ఎదురైంది. నాటింగ్హామ్లో 125 పరుగుల ఓటమి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను గిల్ సారథ్యంలోని భారత్ 2-1తో కోల్పోయింది.
అయితే సమావేశం ఉద్దేశం తప్పులు ఎత్తిచూపడం కాదని బీసీసీఐ భావిస్తోంది. జట్టు ఎంపిక, సన్నద్ధత, ఆటతీరులో వస్తున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంపైనే దృష్టి పెట్టనుంది. ఫిట్నెస్ అంశం కూడా కీలకం కానుంది. జస్ప్రీత్ బుమ్రా మోకాలి సమస్యతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు సెప్టెంబర్ 9న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ పరీక్షలు జరగనున్నాయి.
ఇక వీవీఎస్ లక్ష్మణ్కు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించే అంశం కూడా చర్చలో ఉంది. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయనకు మరో ఏడాది పొడిగింపు ఇవ్వడంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్కు ముందు వన్డే జట్టుకు స్పష్టమైన దిశను నిర్ణయించడం ఇప్పుడు బీసీసీఐ ముందున్న ప్రధాన అంశంగా కనిపిస్తోంది.

