కలం, వెబ్ డెస్క్ : కడప సబ్ జైలు (Kadapa Sub Jail) వద్ద ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రిమాండ్లో ఉన్న ఖైదీ పోలీసుల కళ్లెదుటే పరారయ్యాడు. ఈ ఘటనతో జైలు, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి ఒక దొంగతనం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడిపై మరో దొంగతనం కేసు నమోదు కావడంతో, విచారణ నిమిత్తం పిటి (PT) వారెంట్పై పోలీసులు రాయచోటి కోర్టుకు తరలించారు.
కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీసులు అతడిని తిరిగి కడపకు తీసుకొచ్చారు. అయితే, కడప సబ్ జైలు ఆవరణలోని లోపలికి తీసుకెళ్తున్న సమయంలో, వీరారెడ్డి పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
జైలు ప్రాంగణం నుంచే ఖైదీ పరారు కావడంతో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి, పరారైన వీరారెడ్డిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

