కలం, నిర్మల్: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై వరుస అరెస్టులు, నిర్బంధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) మండిపడ్డారు. గురువారం 22ఏ భూముల అక్రమాలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లాంటి ప్రజా సమస్యలపై బీజేపీ నిరసనకు దిగింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఏలేటిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, ఆ హక్కును కాలరాసే విధంగా పోలీసుల చర్యలు ఉండటం సరికాదన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? అంటూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

