కలం, కరీంనగర్ బ్యూరో: ఎంపీడీవో చెక్కబండి జగన్మోహన్ రెడ్డి (MPDO Jaganmohan Reddy) ఆత్మీయ సన్మాన మహోత్సవం బుధవారం కరీంనగర్లోని టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘంగా 43 ఏళ్ల పాటు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వీడీవో) నుంచి ఎంపీడీవో స్థాయి వరకు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించి వీరు పదవీ విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు తదితరులు పాల్గొని జగన్మోహన్ రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
అంకితభావంతో పనిచేశారు..
ఈ సందర్భంగా డీపీఓ జగదీశ్వర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలతో నేరుగా మమేకమై పనిచేసే పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేయడం ఒక వరం అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వీడీవో) స్థాయి నుంచి ఎంపీడీవో వరకు వివిధ హోదాల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని కొనియాడారు. ఎలాంటి మచ్చ లేకుండా గౌరవప్రదంగా రిటైర్ కావడం అభినందనీయమన్నారు.
ప్రేమకు రిటైర్మెంట్ ఉండదు..
అనంతరం జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ ఉంటుంది కానీ, ప్రజలకు అందించిన సేవలకు, సంపాదించుకున్న ప్రేమకు ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు” అని అన్నారు. హోదాలు తాత్కాలికమని, చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, టీఎన్జీవోస్ జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ రాము, దివ్యదర్శన్ రావు, సర్దార్ హరేమేందర్ సింగ్, రాజేష్ భరద్వాజ్, టీఎన్జీవోస్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఈ. శారద, ఎంపీడీవోలు సతీష్ రావు, నరసింహారెడ్డి, డీఎల్పీఓ శ్రీనివాస్, హరికృష్ణ, గోదారి అజయ్, కిరణ్, రేవంత్ రెడ్డి, వివిధ మండలాల ఎంపీఓలు, ఎంపీడీవోల సంఘం బాధ్యులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు.

