కలం, పెద్దపల్లి: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం పొందాల్సిన బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి (Peddapalli ) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వారిపై చర్యలు చేపట్టాలి..
బకాయిలు చెల్లించని మిల్లర్ల ఆస్తులను వెంటనే గుర్తించి, రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా వసూళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

