కలం, వెబ్డెస్క్: ఆ పాప చదివేది ఒకటో తరగతి.. ఆమెకు పట్టుమని పదేళ్ల వయసు కూడా ఉండదు.. కానీ, కొండంత గుండె ధైర్యం ఉంది. అందుకే ఒక కాలు దెబ్బ తిన్నా ఇంట్లో ఉండకుండా ఒంటి కాలితో గెంటుతూ బడికి వెళ్లి చదువుకుంటోంది. ప్రస్తుతం ఈ పాపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బలియా జిల్లాకు చెందిన రాగిణి (7)కి ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు ఓ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలు విరిగింది. అయితే రాగిణి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆమెకు సరైన వైద్యం అందించలేకపోయారు. దీంతో చిన్నారి దివ్యాంగురాలిగి ఉండిపోయింది.
రాగిణి ఇంటికి అర కిలోమీటరు దూరంలోనే ప్రభుత్వ బడి ఉంది. రోజు తన ఇంటి ముందు నుంచే పిల్లలందరూ బడికి వెళ్తుంటారు. వీళ్లను చూసిన రాగిణికి చదువుకోవాలన్న ఆశ కలిగింది. శరీరం సహకరించకపోయినా ఒక్క కాలితో కుంటుకుంటూ బడికి వెళ్తోంది. రాగిణి బడికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు రాగిణి స్థానంలో ఎవరున్నా ఇంత ధైర్యంగా బడికి వెళ్లేవారు కాదని నెటిజన్లు చిన్నారిని ప్రశంసిస్తున్నారు.
రాగిణి తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి కూలీ పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. పాపకు కృత్రిమ కాలు గానీ, ట్రై సైకిల్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, రాగిణి తల్లిదండ్రులకు అంత స్థోమత లేదని స్కూల్ టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాగిణి గురించి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బలియా జిల్లా కలెక్టర్ మంగల ప్రసాద్ సింగ్ స్పందించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాన్ని అక్కడికి పంపించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

