కలం, వెబ్డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఈ సమ్మిట్లో భాగంగా డిఫెన్స్ ఎక్స్పో జరుగనుంది. దీన్ని ప్రారంభించాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ను సీఎం కోరారు. అలాగే డిఫెన్స్ ఎక్స్పోలో ఎయిర్ షోలు, సూర్యకిరణ్ ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో సీఎం వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, పలువురు తెలంగాణ ఎంపీలు, అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. రక్షణ ఎక్స్పో లో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. ఈ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని కోరారు. ఎయిర్షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వాలని కోరారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాలు భూ సేకరణ చేపట్టిందని రక్షణ శాఖ మంత్రికి సీఎం తెలియజేశారు. రక్షణ శాఖ కోరినట్లు మొత్తం 1500 ఎకరాలు కోరినందున, మరో 750 ఎకరాలు సేకరించే ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే దానిని మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిపారు.

