కలం, వెబ్ డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన (Yadagirigutta Temple) పరిసరాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలు భక్తులలో తీవ్ర భయాందోళనలు రేకేత్తిస్తున్నాయి. కొండపై పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ చోరీలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, పెళ్లయిన శుభసందర్భంలో స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు వచ్చిన నూతన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. బాధితుల వివరాల ప్రకారం.. ఓ కొత్త జంట తమ కుటుంబ సభ్యులతో కలిసి వ్రతం ఆచరించడం కోసం యాదగిరిగుట్టకు వచ్చారు. తమ కారును కొండపై ఉన్న పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి, పూజల కోసం ఆలయంలోకి వెళ్లారు. అయితే వారు వ్రతం ముగించుకుని తిరిగి వచ్చేసరికి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.
కారు విండో అద్దాలను బద్దలుగొట్టి, లోపల భద్రపరిచిని బంగారం, నగదు, విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. కొండపై భక్తుల వాహనాలకు కనీస భద్రత కరువైందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండపైన, కొండ కింద భద్రతా ఏర్పాట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు, పోలీస్ పహారాను మరింత పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

