కలం, వనపర్తి: వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30 అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ (Wanaparthy SP) సునితారెడ్డి (Sunita Reddy) తెలిపారు. ఈ కాలంలో సంబంధిత పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఊరేగింపులు, భారీ సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
జిల్లాలో ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను ముందస్తుగా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏ సంస్థ, సంఘం లేదా వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించదలచినా సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అనుమతి పొందాలని సూచించారు.చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేయగలమని పేర్కొన్నారు. ప్రశాంతమైన వనపర్తి కోసం ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సునితారెడ్డి విజ్ఞప్తి చేశారు.

