కలం, వెబ్ డెస్క్: నేపాల్ వరదల్లో (Nepal Floods) ఓ వ్యక్తి తన కుటుంబం కోసం చేసిన సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా, తన వారిని చూడాలనే అతడి ఆరాటం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వరదలకు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు గట్టులను కలుపుతూ ఏర్పాటు చేసిన వంతెన వరద ధాటికి అటు ఇటు ఊగుతోంది. ఏ క్షణమైనా వంతెన తెగిపోయే అవకాశం ఉందని ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఇంతలో ఓ వ్యక్తి వేగంగా వంతెనపై పరుగెత్తడం ప్రారంభించాడు. అప్పటికే వరద వంతెనకు చాలా దగ్గరకు చేరుకుంది. ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఎలాగైనా చేరుకోవాలని..
ఆ వ్యక్తి వంతెన మధ్యలోకి చేరుకోగానే.. వరద ఇంకా పెరిగింది. అయినా ఎక్కడా పరుగు ఆపలేదు. అటు వైపున ఉన్నవారు త్వరగా రమ్మని గట్టిగా పిలుస్తున్నారు. ఒక వైపు ప్రమాదం, మరోవైపు తనవారిని చేరుకోవాలనే ఆశ.. అలుపెరగకుండా పరుగెత్తి చివరికి గమ్యం చేరాడు. పెద్ద గండం నుంచి బయటపడటమే కాకుండా తన వారిని కలుసుకున్నాడు. వంతెన తెగిపోతే.. అటు వైపు వెళ్లడానికి మళ్లీ ఎన్ని రోజులు పడుతుందోనన్న ఆందోళనే అతడిని ఈ సాహసం చేసేలా చేసి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఒకవేళ నదిలో పడిపోతే ఇక ఎప్పటికీ తన వారిని కలుసుకోలేడు కదా.. ఇలాంటి సాహసాలు అవసరమా..? అంటున్నారు. ఏదేమైనా కుటుంబం కోసం ఒక వ్యక్తి పడే తపనకు ఈ వీడియోనే సాక్ష్యమని చెబుతున్నారు.

