కలం, స్పోర్ట్స్: ఫుట్బాల్ అభిమానులకు మెస్సీ భారీ షాక్ ఇచ్చాడు. అర్జెంటీనా జాతీయ జట్టు నుంచి రిటైర్ (Retirement) అవుతున్నట్లు 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ (Lionel Messi) ప్రకటించాడు. ఆగస్టు 31న ఇన్స్టాగ్రామ్లో చేతిరాతతో ఉన్న లేఖను పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు. 2026 ప్రపంచకప్ ఫైనల్ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెస్సీ తెలిపాడు. ఫైనల్ ముగిసిన రెండు రోజులకే తన వీడ్కోలు లేఖను రాసినట్లు చెప్పాడు. అయితే తన తండ్రి జార్జ్ మెస్సీ మరణం తర్వాత ఈ నిర్ణయంపై మరింత స్పష్టత వచ్చిందని పేర్కొన్నాడు.
జార్జ్ మెస్సీ ఆగస్టు 8న 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తండ్రి మరణం మెస్సీని తీవ్రంగా ప్రభావితం చేసింది. జాతీయ జట్టును వీడటం బాధాకరమైన నిర్ణయమే అయినా.. ఇదే సరైన సమయమని మెస్సీ (Lionel Messi) భావించాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ రెండు దశాబ్దాలకు పైగా ఆడాడు. ఆరు ప్రపంచకప్లలో పాల్గొన్నాడు. 2022లో ఖతార్ ప్రపంచకప్ను అర్జెంటీనాకు అందించాడు. 2021, 2024 కోపా అమెరికా టైటిళ్లలోనూ కీలక పాత్ర పోషించాడు.
2026 ప్రపంచకప్లోనూ అర్జెంటీనా(Argentina)ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే స్పెయిన్తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయింది. దీంతో ప్రపంచకప్ టైటిల్తో వీడ్కోలు పలకాలన్న మెస్సీ ఆశ నెరవేరలేదు. అర్జెంటీనా తరఫున మెస్సీ 207 మ్యాచ్లు ఆడి 125 గోల్స్ చేశాడు. దీంతో జట్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మెస్సీకి అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు చెప్పడం ఇదే మొదటిసారి కాదు.
2016 కోపా అమెరికా ఫైనల్లో చిలీ చేతిలో ఓటమి తర్వాత కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అభిమానులు, సహచరుల విజ్ఞప్తితో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత మెస్సీ కెరీర్లో అర్జెంటీనాకు మరపురాని విజయాలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం జాతీయ జట్టుతో తన ప్రయాణానికి ముగింపు పలికాడు. అర్జెంటీనా జట్టు ఇక మెస్సీ లేకుండా కొత్త దశను ప్రారంభించనుంది.
Also Read : మెస్సీ రిటైర్మెంట్.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: Instagram

