కలం, నిర్మల్ : రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా ముసుగులో ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న రెండు రోజుల మహా దీక్షను విజయవంతం చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మహా దీక్ష సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్కు తరలివచ్చే పార్టీ శ్రేణుల సమన్వయం, ఏర్పాట్లపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. భూ బదిలీలు, ఆస్తుల బదలాయింపు పేరుతో జరుగుతున్న అక్రమాలు, కుంభకోణాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకే మహా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ ముందుంటుందని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ భూముల నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

