కలం, కరీంనగర్: జిల్లా కేంద్రంలో క్షేత్ర స్థాయి సమస్యలపై పాలకవర్గ సమావేశంలో చర్చించి పరిష్కారం మార్గానికి ప్రయత్నం చేయాలేగానీ.. మాజీ మేయర్లుగా పని చేసిన వాళ్లే వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) పేర్కొన్నారు. మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూరుకుపోయిన డ్రైనేజీని పరిశీలించిన అనంతరం పక్కన గల అమరవీరుల స్థూపం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం నుండి నిధుల వరద తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఓట్లు దండుకున్నారని ఆరోపించారు.
ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని.. నగర అభివృద్ధిపై వీరికి చిత్తశుద్ధి లేదని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటాను కేంద్రం నుండి తీసుకువచ్చినట్టు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని విమర్శించారు. ఆధిపత్య పోరుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని.. ఇప్పటికైనా కేంద్రం నుండి నగర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, నిరుద్యోగ యువతకు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేయాలని కోరారు.

