కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ (Councillor Lakshminarayana) హైదరాబాద్ మారథాన్లో సత్తా చాటారు. ఆదివారం తెల్లవారుజామున NMDC ఆధ్వర్యంలో జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెం (మారథాన్)లో ప్రతిభ కనబరిచారు. నెక్లెస్ రోడ్డు, సచివాలయం, ట్యాంక్ బండ్, KBR పార్క్, దుర్గం చెరువు, ఓల్డ్ బాంబే రోడ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగింది.
42 కిలోమీటర్ల దూరాన్ని లక్ష్మినారాయణ 3 గంటల 54 నిమిషాల్లో ఎక్కడా ఆగకుండా పూర్తి చేశారు. ఈ మారథాన్ కోసం మూడు నెలలుగా సిద్ధమవుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. గత పది రోజులుగా రోజుకు పది కిలోమీటర్ల చొప్పున పరుగు తీసినట్లు వివరించారు. ఇప్పటి వరకు గెరిగంటి లక్ష్మినారాయణ జిల్లా, రాష్ట్ర స్థాయిలో 10 పతకాలు సాధించడం కూడా గమనార్హం.

