కలం, హుజూర్నగర్: సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి సుదూర తీరాలనైనా దగ్గర చేస్తుందని మరోసారి నిరూపితమైంది. అమెరికాలో జరిగిన ఓ వైరల్ వెడ్డింగ్ (Viral Wedding) తెలంగాణలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఏకైక కుమార్తె వివాహాన్ని తల్లిదండ్రులు గ్రామంలోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా వీక్షించి, వర్చువల్గానే ఆశీర్వదించిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఆమెకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్తో పరిచయ ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఇరువైపులా పెద్దలను ఒప్పించిన ఈ జంట, శుక్రవారం రాత్రి అమెరికాలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు.
కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లలేకపోయిన హిమబిందు తల్లిదండ్రులు, వేపలసింగారంలోని తమ నివాసంలోనే స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం (ఆన్లైన్) ద్వారా వివాహ వేడుకను కళ్లారా వీక్షించారు. వేద మంత్రాల నడుమ కొత్త జంట ఒకటవుతున్న సమయాన తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతూ అక్షింతలు చల్లి దీవించారు. అనంతరం, తమ కుమార్తె వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని బంధుమిత్రులు, గ్రామస్థులకు జయరాజు-జ్యోతి దంపతులు ఘనంగా పెళ్లి విందు ఏర్పాటు చేశారు. సాంకేతికత పుణ్యమా అని దూరభారాన్ని మరిచి తమ బిడ్డ పెళ్లిని కళ్లారా చూసుకున్నామని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

