కలం, వెబ్ డెస్క్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పలు ముఖ్యమైన రెస్టారెంట్లు (Hyderabad Restaurants) నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనలు వెలుగుచూడడంతో యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చట్నీస్, స్పైస్ 6, ఓరిస్ (బంజారాహిల్స్), ది స్పైసీ వెన్యూ (జూబ్లీహిల్స్), ఫోర్ సీజన్స్ మల్టీక్యుసిన్ రెస్టారెంట్, షా ఘౌస్ (టోలిచౌకి), పిస్తా హౌస్ (గచ్చిబౌలి) ప్రముఖ హోటళ్లలో ఈ తనిఖీలు చేపట్టారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తనిఖీల సమయంలో వంటగదుల్లో పరిశుభ్రతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన పదార్థాలను పరిశీలించగా, గడువు ముగిసిన ఆహార వస్తువులు, కుళ్ళిపోయిన కూరగాయలు ప్రత్యక్షమయ్యాయి. ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలోనూ ఎఫ్ఎస్ఎస్ఐ (FSSAI) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇక వంటగదులు, స్టోర్ రూములలో బొద్దింకలు, ఈగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆహార భద్రతా నిబంధనలు, లేబ్లింగ్, డిస్ప్లే నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించినందుకు గాను సంబంధిత రెస్టారెంట్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. తక్షణమే లోపాలను సరిదిద్దాలని, లేకుంటే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

