కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) తీవ్రంగా స్పందించారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టర్పై పీసీబీ ఫిర్యాదు చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఈ వ్యవహారం ఒక జోక్లా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులైమాన్, ఖాసిమ్ల ఇంటర్వ్యూను సదరు బ్రాడ్కాస్టర్ ప్రసారం చేసింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్యం, భద్రతపై ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశించినట్లు, ప్రసారం చేస్తే ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టును బహిష్కరిస్తామని పాకిస్థాన్ జట్టు హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే ఇంటర్వ్యూ నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా ప్రసారం కావడంతో పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగింది. అనంతరం ప్రసారంపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఇస్లామాబాద్లో జన్మించిన ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja).. పీసీబీ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిలా ఉండగా, 2023 నుంచి రావల్పిండి జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని కోరారు.
ఇమ్రాన్ ఖాన్కు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు గౌరవప్రదమైన చికిత్స కల్పించాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను గ్రెగ్ చాపెల్ సహా 21 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు కోరారు. ఈ విజ్ఞప్తికి పాట్ కమిన్స్ పూర్తి మద్దతు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అంశం క్రికెట్కు అతీతంగా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుండగా.. పీసీబీ, బ్రాడ్కాస్టర్ మధ్య వివాదంపై ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Also Read : వరల్డ్ కప్ గెలిచాడు.. టీమ్లోనే చోటు పోయింది!
Follow Us On: X(Twitter)

