కలం, పెద్దపల్లి: ప్రయాణికుల కష్టాలను తీర్చే విధంగా జిల్లాలో (Peddapalli) చేపడుతున్న రైల్వే వంతెన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో కన్నాల రైల్వే వంతెన పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములుతో కలిసి సమీక్షించారు. గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్పల్లి ప్రాంతాల్లో చేపడుతున్న లెవల్ క్రాసింగ్ సంబంధిత రహదారి, రైల్వే వంతెన పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని కలెక్టర్ తెలిపారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి అవకాశం ఇవ్వకుండా పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పెద్దపల్లి ఏడీ సర్వేయర్ సోమేశ్వర్, ఆర్డీఓ గంగయ్య, ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

