కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీచేర్యాగడి-సజ్జాపూర్ రోడ్డులోని చెరువు సమీపంలో ఓ డీసీఎం వాహనం ఆటోను ఢీకొని ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న దంపతులిదద్దరూ మృతి చెందారు. మండలంలోని బడంపేటకు చెందిన రాచయ్య(40) భార్య పద్మమ్మ(35)తో కలిసి వికారాబాద్ జిల్లా బంటారం నుంచి ఆటోలో వెళ్తున్నాడు. సజ్జాపూర్ వద్ద డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అదుపుతప్పిన డీసీఎం ఆటోపైనే పడింది.
ఈ దుర్ఘటనలో ఆటో నడుపుతున్న రాచయ్యతో పాటు ఆటోలో వెనక కూర్చున్న పద్మమ్మ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కోహీర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోహీర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

