కలం, నిజామాబాద్ బ్యూరో : అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారికి, పేరు, వయసు వంటి అంశాలలో వ్యత్యాసం కలిగి ఉన్న ఓటర్లకు హియరింగ్ కు రావాలని కోరుతూ బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ నోటీసులు జారీ చేస్తున్న నేపధ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో గల కంటేశ్వర్ లో సిబ్బంది ఇంటింటికి తిరిగి నోటీసులు అందిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలన జరిపారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
వారు విధులు నిర్వర్తిస్తున్న తీరును పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమందికి నోటీసులు అందించారు, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉన్నది, పోలింగ్ కేంద్రం పరిధిలో మ్యాపింగ్ జరగని ఓటర్లు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధృవీకరణ అవసరం ఉన్న ఓటర్ల ఇంటింటి స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని, సూచించిన సమయానికి ఒకవేళ వారు రాలేకపోతే మరోమారు నోటీసు ఇవ్వాలని సూచించారు.
నోటీసు అందించే సమయంలోనే ఎవరైనా ఓటర్లు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించవచ్చని అన్నారు. నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీ.ఎల్.ఓ సూపరింటెండెంట్ మురళి, బీఎల్ఓ లావణ్య ఉన్నారు.

