కలం, ఖమ్మం బ్యూరో: నాటిన ప్రతి మొక్కనూ దత్తత తీసుకొని, సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మనం ఇచ్చే నిజమైన కానుక అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో గురువారం ‘వనమహోత్సవం’ జరిగింది. జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో పొంగులేటి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎల్నినో పరిస్థితులకు వాతావరణ అసమతుల్యతే కారణమన్నారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు భాగస్వాములై నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

