కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలోని భైంసా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, తానూర్ పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసాయని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, సున్నిత ప్రాంతాలు, ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించిన మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, యువజన సంఘాలు, ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అన్ని పండుగలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

