కలం, ఖమ్మం బ్యూరో: సినిమా చూస్తూ హాయిగా వినోదాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. థియేటర్లో ఒక్కసారిగా ప్రత్యక్షమైన పామును చూసి హౌస్ఫుల్ హాలులోని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని (Kothagudem) ఓ థియేటర్లో బుధవారం ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది.
పట్టణంలోని థియేటర్లో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన జరుగుతుండగా హాలులోకి అకస్మాత్తుగా ఒక పాము ప్రవేశించింది. చీకట్లో పామును గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో థియేటర్లో తీవ్ర గందరగోళం, తోపులాట లాంటి పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులలో ఆందోళన పెరిగిపోవడంతో యాజమాన్యం వెంటనే సినిమా ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేసింది. అనంతరం ఆ పామును చంపివేయడంతో పరిస్థితి కొద్దిసేపటికి అదుపులోకి వచ్చింది.
సంఘటన జరిగిన సమయంలో హాలు నిండుగా ఉండటంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం జరిగి ఉండేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లో కనీస పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, అనుకోని ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిదంటూ యాజమాన్యం తీరుపై ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి థియేటర్లలో తగిన భద్రతా చర్యలు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు.

