కలం, ఖమ్మం బ్యూరో: రాజకీయాలు, కులమతాలకు తావులేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, సంక్షేమ ఫలాలను నేరుగా పేదింటి గుమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. బుధవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానావాయిగూడెంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పర్యటించిన ఆయన, రూ.212.25 లక్షల సుడా నిధులతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయిందని, మిగిలిన కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కైకొండాయిగూడెంలో ఇప్పటివరకు రూ.12.83 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన ప్రాంతాల్లోనూ దశలవారీగా రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

