కలం, వెబ్డెస్క్: దాదాపు 17 ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) తాత్కాలిక అధినేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ (Tarique Rahman ) ఎన్నికల బరిలో నిలిచారు. బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో (Bangladesh elections) ఢాకా–17, బోగ్రా–6 నియోజకవర్గాల నుంచి పోటీకి ఆయన తరఫున ప్రతినిధులు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బంగ్లాదేశ్లో ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తారిఖ్ పోటీ చేసేందుకు వీలుగా ఆయన్ను ఓటర్ల జాబితాలోకి చేర్చేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పదవీచ్యుత మాజీ ప్రధానికి చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారత వ్యతిరేకత, ఉస్మాన్ హాది హత్య కీలకం కానున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం దాదాపు ఐదు ఇళ్లను అల్లరి మూకలు తగలబెట్టాయి. రాజధాని ఢాకాలో ఇంక్విలాబ్ మాంఛో కార్యకర్తలు భారత వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు, నినాదాలు కొనసాగించారు. బంగ్లాదేశ్లో ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లు రద్దు చేయాలని, ఉస్మాన్ హాది హంతకులను, షేక్ హసీనాను భారత్ వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హసీనా అప్పగింత కోసం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు.


