కలం, వనపర్తి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యూపీఏ ఫొటో కాంటెస్ట్–2026లో వనపర్తికి చెందిన ఫొటో జర్నలిస్టు ఎస్వీ రమేష్ (SV Ramesh) ప్రతిభ చాటారు. లయన్స్ క్లబ్ విజయవాడ ఆటోనగర్ జెమ్స్ సహకారంతో నిర్వహించిన పోటీల్లో మిస్ట్ విభాగంలో మూడో బహుమతి సాధించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో విజేతలకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పేసపి ఈశ్వర్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి వనమాలి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 140 మంది ఫొటోగ్రాఫర్లు పోటీల్లో పాల్గొన్నారు. అవార్డు ప్రదానోత్సవానికి సుమారు 200 మంది ఫొటోగ్రాఫర్లు హాజరయ్యారు. మిస్ట్ విభాగంలో మూడో బహుమతి సాధించిన ఎస్వీ రమేష్ను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి జి. మధుగౌడ్, జిల్లా అధ్యక్షుడు డి. మాధవరావు, జిల్లా కార్యదర్శి బి. రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి, ప్రశాంత్, రాష్ట్ర హౌస్ సైట్ కో-కన్వీనర్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి మన్యం, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్, పట్టణ అధ్యక్షుడు తైలం అరుణ్రాజ్ తో పాటు పలువురు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు అభినందించారు.

