కలం, వెబ్ డెస్క్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతాంగ ఉద్యమ నిర్మాత, రైతు సంఘం అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి (Sarampally Malla Reddy) తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం 3 గంటలకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.
సారంపల్లి సేవలు చిరస్మరణీయం: మంత్రి పొన్నం
రైతాంగం, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్త చేసుకున్నారు. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, రైతు సంఘం ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజా ఉద్యమ నాయకుడిని కోల్పోవడం రైతాంగ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని పొన్నం ప్రభాకర్ అన్నారు. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు, రైతాంగ ఉద్యమ కార్యకర్తలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

